Nagarjuna | ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఎన్ కన్వెన్షన్కి సంబంధించి వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వినిపిస్తున్నాయన్నారు. కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అని తెలిపింది. ఒక్క సెంట్ భూమి సైతం ఆక్రమించింది కాదన్నారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని స్పెషల్ కోర్ట్.. ఏపీ లాండ్ గార్బింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్ 24-02-2014న ఒక ఆర్డర్ ఎస్ఆర్ 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. న్యాయస్థానం తీర్పునకు తాను కట్టుబడి ఉంటానని.. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని అభ్యర్థిస్తున్నానంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
అయితే, నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని శనివారం హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు కూల్చివేశారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో శనివారం తెల్లవారు జాము నుంచే అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సిద్ధమయ్యారు. అయితే, ఈ విషయంపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేలోపే అధికారులు కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేశారు. మరో వైపు శనివారం వరకు జరిగిన కూల్చివేతలపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 18 ప్రాంతాల్లో కూల్చివేతలు నిర్వహించినట్లు నివేదికలో పేర్కొన్నది.
ఈ క్రమంలో 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. టాలీవుడ్ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను సైతం కూల్చివేసినట్లు తెలిపింది. ప్రొ కబడ్డీ లీగ్ ఓనర్ అనుపమ భవనం, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్రావు, మంథనికి చెందిన బీజేపీ నేత సునీల్రెడ్డి నిర్మాణాలను కూల్చివేశామని చెప్పింది. ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆక్రమించిన 12 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. బహదూర్పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్కు చెందిన ఐదంతస్తుల భవనం, ఎంఐఎం మహ్మద్ మీర్జా భవనాన్ని కూల్చివేసినట్లు నివేదికలో పేర్కొంది. నందగిరి హిల్స్లోని ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి భవనం, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు షెడ్డు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడి నిర్మాణం కూల్చివేసినట్లు వివరించింది.
ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ,
N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2024