బతుకుతెరువు కోసం సముద్రంపైకెళ్లి శత్రుదేశానికి బందీగా మారిన ఓ భర్త చేసే పోరాటం. పెనిమిటిని దక్కించుకోటానికి నిండుచూలాలైన ఓ భార్య మాతృదేశంలో పడే ఆరాటం.. వెరసి ‘తండేల్’. ఆర్థ్రతతో నిండిన కథ, కథనాలతో సాగే ఈ పరిపూర్ణప్రేమకథకు నాయకా, నాయికలు నాగచైతన్య, సాయిపల్లవి. ప్రారంభం నుంచి అంచనాలు అంబరాన్ని తాకిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు. చందు మొండేటి దర్శకుడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారం ఉడిపిలో మొదలైంది.
పాత్రధారులంతా పాల్గొనే ఈ కీలక షెడ్యూల్లో కొంత టాకీతోపాటు యాక్షన్ పార్ట్ కూడా చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ కర్ణాటకలోని మాల్సే పోర్ట్(ఉడిపి)లో జరుగుతున్నది. నాగచైతన్య, ఫైటర్స్పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగచైతన్య ఇందులో మత్యకారుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న యదార్థగాథని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్దత్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సమర్పణ: అల్లు అరవింద్.