ముషీరాబాద్, జూలై 2: హరితహారం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ముషీరాబాద్, అడిక్మెట్ డివిజన్లలోని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముషీరాబాద్ బాలికల పాఠశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ ఎన్. సుప్రియ నవీన్గౌడ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. బస్తీలు, కాలనీలతో ఎక్కడ ఖాళీ జాగా ఉన్నా మొ క్కలు నాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, హమ్మదుల్లా, రాజు, మల్లేశ్యాదవ్, బల్ల ప్రశాంత్, రవియాదవ్, బి.శ్రీనివాస్రెడ్డి, ఖదీర్, బీజేపీ నాయకులు నవీన్గౌడ్, భద్రి, అనిల్, కంచి తదితరులు పాల్గొన్నారు. అడిక్మెట్ డివిజన్ లక్ష్మమ్మ పార్కులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, కార్పొరేటర్ సునీతాగౌడ్ మొక్కలు నాటారు.
ముషీరాబాద్ డివిజన్ ఆదర్శకాలనీలోని డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. శుక్రవారం ఆయన ఆదర్శ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు జలమండలి జీఎం మహేశ్, డీజీఎం మాధవిలతో కలిసి బస్తీలో పర్యటించి డ్రైనేజీ సమస్య తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు బస్తీలో పారుతున్న మురుగు నీటితో ఇక్కట్లు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జలమండలి మేనేజర్ హకీం, టీఆర్ఎస్ నాయకులు మల్లేశ్యాదవ్, సాంబశివరావు, శ్రీధర్రెడ్డి, ఆదర్శకాలనీ అధ్యక్షుడు గాలి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.