Multi Starrer | తనదైన శైలితో పాటు, కంటెంట్ ఉన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి వార్తల్లో నిలిచారు. సైలెంట్గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసి వెళ్ళే ఫార్ములాతో కెరీర్లో సక్సెస్ల పరంపర కొనసాగిస్తున్న ఆయన, తాజాగా మరో మల్టీస్టారర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ధనుష్–నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇడ్లీ కొట్టు సినిమా అక్టోబర్ 1న విడుదలై ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్ లతో సినిమాపై మంచి హైప్ తెచ్చుకుంది. కాకపోతే అనుకున్నంత హిట్ కాలేకపోయింది. ఇక ఇదే సమయంలో ధనుష్ మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ తో స్క్రీన్ షేర్ చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. కథ, దర్శకుడు వంటి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. మల్టీస్టారర్స్ ధనుష్కు కొత్తేమీ లేదు. ఇటీవల నాగార్జునతో కలిసి చేసిన “కుబేర” సినిమాలో ఆయన నటన విపరీతమైన ప్రశంసలు అందుకుంది. నాగ్ కూడా తన స్వాగ్కు ఏ మాత్రం తీసిపోకుండా సహజ నటనతో మెప్పించాడు. ఇదే సమయంలో మోహన్లాల్తో చేయబోతున్న సినిమా పట్ల కూడా అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. ధనుష్- మోహన్ లాల్ కలిసి నటిస్తే బాక్సాఫీస్ చేయడం ఖాయం అని అంటున్నారు.
ఇక మోహన్లాల్ విషయానికి వస్తే, ఆయన ఇటీవలే 2023 సంవత్సరానికి గానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ గౌరవం ఆయనకు దక్కింది. అలాంటి లెజెండరీ నటుడితో ధనుష్ కలిసి నటించనున్న ప్రాజెక్ట్పై కోలీవుడ్, మలయాళ ఇండస్ట్రీలలో హైప్ క్రియేట్ అవుతోంది. ఈ వయస్సులోను మోహన్ లాల్ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాడు. ఆయన సినిమాలని వివిధ భాషలలో రీమేక్ చేసి మంచి విజయాలు సాధిస్తున్నారు.