తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అగ్ర కథానాయికగా చెలామణీ అవుతున్నది మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తొలుత మరాఠీ, హిందీ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినా..ఆమె ప్రతిభకు తగిన గుర్తింపు లభించలేదు. తెలుగులో ‘సీతారామం’ ఈ అమ్మడి కెరీర్ను మలుపుతిప్పింది. ఈ సినిమాలో సీత పాత్రలో అద్భుతాభినయాన్ని కనబరచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో విజయ్ దేవరకొండ, నాని చిత్రాల్లో నాయికగా నటిస్తున్నది. త్వరలో తమిళంలో కూడా అరంగేట్రం చేయబోతున్నది.
ఐదేళ్ల కఠోర శ్రమ, నిరీక్షణ ఫలితమే తన విజయానికి కారణమని చెప్పిందీ భామ. ఆమె మాట్లాడుతూ ‘నటనపై విపరీతమైన వ్యామోహంతో ఎలాంటి లక్ష్యాలను పెట్టుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమా జయాపజయాల గురించి ఏ రోజు ఆలోచించలేదు. ఎలాంటి పాత్ర దక్కినా పరిపూర్ణంగా న్యాయం చేసే ప్రయత్నం చేశాను. నా సుదీర్ఘ నిరీక్షణకు నేడు ఫలితం దక్కుతున్నది. మనసుకు నచ్చిన మంచి పాత్రలు నన్ను వరిస్తున్నాయి’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది.