‘సీతారామం’ చిత్రంతో తెలుగులో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో అద్భుతమైన అభినయంతో అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నాని 30వ చిత్రంలో నాయికగా నటిస్తున్నది. తెలుగులో భారీ అవకాశాలు వస్తుండటంతో ఈ అమ్మడు హైదరాబాద్లో స్థిరపడాలని నిర్ణయించుకుందని, ఈ మధ్యే విలాసవంతమైన ఇల్లును కూడా కొనుగోలు చేసిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా వీటిపై వ్యంగ్యంగా స్పందించిందీ భామ. ఆ ఇల్లు ఎక్కడ ఉందో చెబితే తాను కూడా చూసి వస్తానంటూ సెటైర్ విసిరింది. అయితే హైదరాబాద్ తనకు నచ్చిన నగరమని, భవిష్యత్తులో తప్పకుండా ఇక్కడే ఇల్లు కొనుక్కొని సెటిలైపోతానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ నాని 30వ చిత్రంతో పాటు హిందీలో పూజా మేరీ జాన్, పిప్పా అనే చిత్రాల్లో నటిస్తున్నది.