ముంబై: అలనాటి నటుడు మిథున్ చక్రవర్తికి మాతృవియోగం సంభవించింది. ఆయన తల్లి శాంతిరాణి దేవి వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. శాంతిరాణి దేవి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మిథున్ చక్రవర్తి కుమారుడు నమాషి చక్రవర్తి కూడా తన నాయనమ్మ మరణించినట్లు వస్తున్న వార్తలు నిజమేనని ధృవీకరించాడు. ‘అవును, ఆ వార్త నిజమే. మా నాయనమ్మ ఇక మాతో ఉండదు’ అని పేర్కొన్నాడు. కాగా, మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్కుమార్ చక్రవర్తి 2020లో తన 95వ ఏట కిడ్నీ విఫలమై ప్రాణాలు కోల్పోయాడు.
ప్రస్తుతం మిథున్ చక్రవర్తి డ్యాన్స్ బంగ్లా డ్యాన్స్ అనే రియాలిటీ సో షూటింగ్తో బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ అయిన ఈ రియాలిటీ షో 12వ సీజన్ ప్రస్తుతం కొనసాగుతున్నది.