హైదరాబాద్: దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్ పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఆయ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యావత్ భారతదేశంలో విశ్వనాథ్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. కళలు, సామాజిక స్పృహ ఉన్న గొప్పవ్యక్తి అని, తన సినిమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. శంకరాభరణం చిత్రం ప్రతి ఒక్కరినీ కదిలించిందని తెలిపారు. విశ్వనాథ్ను అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయని వెల్లడించారు. ఆయన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చిత్రాలు తీశారన్నారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అరుదైన దర్శకుడు కే.విశ్వనాథ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వారి మరణం తెలుగు సినిమా పరిశ్రమకు, ప్రేక్షకులకు తీరనిలోటన్నారు. సంప్రదాయ సంగీతానికి, సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వారు రూపొందించిన చిత్రాలు ప్రేక్షకుల మదిలో ఎంతో కళాత్మకంగా నిలిచాయన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య , పద్మ శ్రీ వంటి అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయన్నారు.
విశ్వనాథ్ మృతిపట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు.