హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్కు దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి చిరంజీవికి శాలువాకప్పి పుష్పగుచ్చం అందించారు. ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని, మరిన్ని అవార్డులు అందుకోవాలన్నారు.
ఉత్తమ నటుడైన చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు పొందడం గర్వకారణమని, భవిష్యత్తులో ‘భారతరత్న’ కూడా రావాలని ఆకాంక్షించారు. పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం ‘విశ్వంభర’ వరకు విజయవంతంగా సాగుతుందన్నారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాదిమంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మంత్రి కోమటిరెడ్డితోపాటు ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు దిల్ రాజు కూడా ఉన్నారు.