“దసరా’ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా గొప్పగా తీశాడు. నాని ఈ సినిమాతో మా తెలంగాణ బిడ్డగా మారిపోయాడు. తెలంగాణ కళాకారులకు నిలయం. ఇలాంటి విజయాలతో తెలంగాణ నుంచి మరింత మంది కళాకారులు వస్తారు’ అని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. బుధవారం కరీంనగర్లో జరిగిన ‘దసరా’ చిత్ర విజయోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ‘సినిమా వేడుకలకు కరీంనగర్ చక్కటి వేదికలా మారింది. మానేరు నీళ్లలో ఒక శక్తి ఉంది. ఇక్కడ నీళ్లు తాగిన సిరిసిల్ల బిడ్డ వేణు ఎల్దండి ‘బలగం’తో మంచి విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ‘దసరా’తో శ్రీకాంత్ ఓదెల హిట్ కొట్టాడు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మణిరత్నాలు బయటకొస్తున్నాయి’ అన్నారు. నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా షూటింగ్కు ముందు దర్శకుడు శ్రీకాంత్ నాతో మాట్లాడుతూ ‘మీ లాంటి హీరోకు వందకోట్ల పోస్టర్ పడితే చూడాలని కోరికగా ఉంది’ అని అన్నాడు. అది ఈ రోజు నెరవేరింది. ప్రతి ఒక్కరికి కలలుంటాయి మీరు నమ్మితే బలంగా రంగంలోకి దిగండి. ప్రాణం పెట్టి పనిచేస్తే తప్పకుండా మీ కలలన్నీ నెరవేరుతాయి.
దసరా అంటేనే చెడుపై మంచి గెలవడం. నేడు దసరా అనే మన మంచి గెలిచింది. ఈ రోజుల్లో సినిమా విడుదలవుతుందంటే అది బాగా ఆడాలని కోరుకునే వారికంటే..పరాజయం పాలవ్వాలని కోరుకునే వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. వాళ్లందరిది తప్పు అని నిరూపించాలి. ఈ నెగెటివిటీ అనే చెడు మీద ఈ రోజు మంచి గెలిచింది. ‘దసరా’ నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం’ అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ “ఈ వేడుకకు విచ్చేసిన మంత్రి గంగుల కమలాకర్గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాకు భారీ విజయాన్ని కట్టబెట్టారు’ అన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్రావు, డిప్యూటీ మేయర్ స్వరూపా రాణి, నటుడు దీక్షిత్శెట్టి, గీత రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు నిర్మాత సుధాకర్ చెరుకూరి బీఎండబ్ల్యూ కారును బహుకరించారు. ఈ మేరకు వేదికపై శ్రీకాంత్ ఓదెలకు కారు తాళాన్ని అందజేశారు.