హైదరాబాద్: సత్యభామగా అందరి హృదయాల్లో పదిలమైన సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జమున మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు. నటిగా ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పనిచేసి విలక్షణమైన వ్యక్తిగా, రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందారన్నారు. సీనియర్ నటులు వరుసగా చనిపోతుండటం సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించారు. జమున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు.