అగ్ర కథానాయకుడు చిరంజీవి అతిథిగా సినీ కార్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తామని కార్మిక సమాఖ్య నాయకులు తెలిపారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్, ఉపాధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, సెక్రటరీ పీఎస్ఎన్ దొర, ట్రెజరర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభనేని అనిల్కుమార్ మాట్లాడుతూ..‘సినిమా రూపకల్పనలో 24 విభాగాల కార్మికుల శ్రమ ఎంతో ఉంది. తెరవెనుక వారి కష్టాలు ఎవరికీ తెలియవు. వారిని గుర్తుంచుకోవాలి. అందుకే కార్మిక దినోత్సవమైన మేడేను ఇకనుంచి చలనచిత్ర కార్మిక దినోత్సవంగా జరుపుకోబోతున్నాం. పదివేల మంది కార్మికులు పాల్గొనే ఈసారి వేడుకలకు చిరంజీవి అతిథిగా వస్తున్నారు. సినీ కార్మికులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, చిరంజీవికి కృతజ్ఞతలు’ అన్నారు.