వికారాబాద్, జూలై 13, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టం పెరుగుతున్నది. మండు వేసవి దాటిన మరుసటి నెలలోనే ఏకంగా నీటిస్థాయి మీటరుకుపైగా పెరుగడంతో భవిష్యత్తుపై ఆశలు సజీవంగా ఉంటున్నాయి. జిల్లాలోని 19 మండలాల్లో 566 గ్రామపంచాయతీలున్నాయి. 8 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదు కాగా.. 4 మండలాల్లో సాధారణం, 5 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. కాగా.. కోట్పల్లి, చౌడాపూర్ మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.
జిల్లావ్యాప్తంగా సగటున 9.4 మి.మీ వర్షం
జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా సాధారణ వర్షపాతంకంటే అధికంగా నమోదైంది. జిల్లావ్యాప్తంగా సగటున 9.4 మి.మీ వర్షం కురిసింది. 70 రోజుల్లో 86.3 సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 80.5 నమోదైంది. రెండు, మూడు రోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో జిల్లా రైతులు ఆనందంతో ఉన్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారేసరికి కులకచర్ల మండలం పుట్టాపహాడ్లో 102.3 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వరకు 8.5 మి.మీ వర్షం కురిసింది.
మండలాల వారీగా..
జిల్లాలో మర్పల్లి, మోమిన్పేట, నవాబుపేట, వికారాబాద్, బంట్వారం, కొడంగల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. సాధారణ వర్షపాతంలో పూడూరు, కులకచర్ల, బొంరాస్పేట, తాండూరు మండలాలుండగా.. తక్కువ వర్షపాతంలో పరిగి, దోమ, ధారూరు, పెద్దేముల్, దౌల్తాబాద్ మండలాలున్నాయి. కోట్పల్లి, చౌడాపూర్ మండలాల్లో అసలు వర్షపాతమే నమోదు కాలేదు. జిల్లాలో మే నెలలో 12.71 మీటర్లు ఉండగా జూన్లో 12.79 మీటర్లకు పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భ జల మట్టం పెరిగింది. ఏకంగా 8 మీటర్ల మేర లోతులోనే నీళ్లు ఉంటున్నాయి. జలాశయ పరివాహక ప్రాంతాల్లో గణనీయంగా భూగర్భ జలం పెరుగుతున్నది. వ్యవసాయ పొలాల్లో రైతులు వాననీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాల్నిస్తున్నాయి. అందుకే జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా నీళ్లు పైపైకి పొంగి రానున్నాయి. రైతులు ఉపాధి హామీ పథకంలో సేద్యపు కుంటలను విరివిగా తవ్వుకోవడంతో పాటు వాననీటి రీచార్జి దిశగా ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తంగా నీటి మట్టాన్ని పెంచే (ఇంకుడుగుంతలు) చర్యలు వేగిరమవడంతో మంచి ఫలితాలు రానున్నాయి.
చెరువులు, కుంటల్లో జలకళ
అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వానలు పడుతున్నాయి. మూడు రోజుల పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. అనంతగిరి కొండల మీదుగా జలపాతం పారుతున్నది. పరిగి, పూడురు, నవాబుపేట మండలాల్లో కురుస్తున్న వర్షాలకు ఈసీ-మూసీలలో వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. అలాగే ఆయా మండలాల్లో ఉన్న చిన్నాచితక వాగులు పొంగిపొర్లుతున్నాయి. మూడు రోజుల క్రితం బంట్వారం వాగులో నీటి ప్రవాహానికి ఒక వ్యక్తి గల్లంతై కిలోమీటర్ మేర వరదలో కొట్టుకుపోయిన వ్యక్తిని స్థానికులు కాపాడారు. వికారాబాద్, తాండూరు డివిజన్ల పరిధిలోని పలు వాగులు, వంకల్లో నీరు ప్రవహిస్తున్నది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతున్నది. మర్పల్లిలో 11.2 మిమీ, మోమిన్పేట 12, నవాబుపేట 20, వికారాబాద్ 38.6, పూడూరు 34.6, పరిగి 17.4, కులకచర్ల 30.4, దోమ 38, ధారూరు 32.2, బంట్వారం 13, తాండూరు 48.2, యాలాల 33, పెద్దేముల్ 16, బషీరాబాద్ 46, బొంరాస్పేట 46, కొడంగల్ 50, దౌల్తాబాద్లో 20మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. సాధారణానికి దగ్గరగా వర్షపాతం నమోదు కావడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరి నాట్లు ముమ్మరం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో నాట్లు వేయడానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు.