మంచు మనోజ్ ఈ మధ్య సినిమాల కన్నా కూడా ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఆ మధ్య తెలంగాణ మంత్రులతో భేటి కాగా, ఈ భేటిలో మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తన అభిమాప్రాయాలను మంత్రులు, ఉన్నతాధికారులతో పంచుకున్నారు.
ఇక ఇటీవల తిరుమలకు వెళ్లినప్పుడు తాను కొత్తగా ఓ బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేందుకు కొత్త ఓ వెంచర్ను మొదలు పెట్టబోతున్నానని పేర్కొన్నారు. మనోజ్ ఈ విషయం చెప్పడంతో అతడు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన మనోజ్.. తప్పుడు న్యూస్ను ప్రచారం చేయవద్దన్నా.. సమ్మర్ నుండి మన సినిమాలు మొదలు అవ్వబోతున్నాయి. యాక్షన్ అని చెప్పక ముందే కట్ చెప్పొద్దు అన్న అంటూ కూల్గా స్పందించాడు.
ఇక మంచు మనోజ్ తాజాగా ఏపీ సీఎం జగన్తో భేటి అయ్యారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన మనోజ్..సీఎం జగన్ని కలవడం గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు, ముందు చూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ది పట్ల ఆయనకున్న దార్శనికత నన్ను ముగ్ధుడిని చేసింది. మంచి పనులు చేస్తున్న మీలాంటి వారికి దేవుడి శుభాకాంక్షలు ఉండాలని కోరుకుంటున్నాను అని మనోజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.