Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్నది. హిమాచల్ప్రదేశ్లోని మండి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న కంగనా రనౌత్కు సర్కాఘాట్ ఎమ్మెల్యే దిలీప్తో పాటు కార్యకర్తలు భాంబ్లాలోని కంగనా నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలతో కలిసి కంగనా హోలీలో పాల్గొన్నారు. అనంతరం కంగనా రనౌత్ మాట్లాడుతూ మండి తన పుట్టినప్రాంతమన్నారు. ప్రజలు నన్ను ఎన్నుకుంటే సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు.
మండి పార్లమెంటరీ నియోజకవర్గంలోకి చేరుకొని ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు కలుస్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్షాకు ధన్యవాదాలు తెలిపారు. ఇంటికి చేరుకున్న కార్యకర్తలు, ఎమ్మెల్యేలందరూ తన సోదరులేనని.. వారి మార్గదర్శకత్వంలో ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. రాజకీయాల్లోకి వస్తున్న నన్ను చూసి కుటుంబం ఎమోషనల్గా ఉందన్నారు. ప్రధాని మోదీ విధానాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తానన్నారు. రాజకీయాల్లో స్థానం సంపాదించాలన్నది తన కల అని పవిత్ర పండుగ హోలీ రోజున నెరవేరిందని కంగనా పేర్కొంది.