కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఈ కేసుపై హీరో మంచు మనోజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. బండి సంజయ్ కొడుకు భగీరథ్ వ్యవహారం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. మైనర్ బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోక్సో యాక్ట్ సక్రమంగా అమలు కావాలని.. అధికారం, పలుకుబడి, రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసు పక్కదారి పట్టకుండా చూడాలని కోరారు.
మైనర్ బాలికలకు సంబంధించిన కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని.. ఇలాంటి కేసుల్లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. ఇది రాజకీయాలు, వ్యక్తులకు సంబంధించిన విషయం కాదని, వాస్తవాలను వెలికితీసి, న్యాయాన్ని గెలిపించాలని మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు.
ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విచారణ పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం ఉందని, ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కారనే విషయం నిరూపించబడాలని ఆయన అన్నారు. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో తెలుగు సినీరంగం నుంచి ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ పోస్ట్ సోషల్మీడియాలో వైరల్గా మారింది.