మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’ ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నది. అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన ఈ సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు నిర్మాతలు అనురాగ్, శరత్. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. శరత్ మాట్లాడుతూ..‘మా చిత్రానికి దేశవ్యాప్తంగా వస్తున్న స్పందన చాలా సంతోషాన్ని ఇస్తున్నది. మా మొదటి చిత్రమే ఇంత ఘన విజయం సాధించడం సంతృప్తినిచ్చింది. సైనికుల గొప్పదనం సినిమాలో చూపించామని ప్రశంసలు వస్తున్నాయి.
ఎప్పటికీ మిగిలిపోయే చిత్రమిది. మేము, శేష్ కలిసి సినిమా చేద్దామనుకునే క్రమంలో నమ్రత, సోనీ పిక్చర్స్ నిర్మాణంలో భాగస్వామ్యులు అయ్యారు. దాంతో చిత్ర మేకింగ్ స్థాయి పెరిగింది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సాధ్యమైనంత ప్రమోట్ చేస్తున్నాం, చివరి షో వరకు కూడా ఇలాగే ప్రేక్షకులను రప్పించేందుకు ప్రయత్నిస్తాం. త్వరలో మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్టులు చేయబోతున్నాం’ అన్నారు. అనురాగ్ మాట్లాడుతూ…‘మా సినిమా చూసిన యువ ప్రేక్షకులు మేము కూడా సైన్యంలోకి వెళ్తామని అంటున్నారు. అంతలా స్ఫూర్తినిచ్చిందీ సినిమా. మా సినిమా చూసేందుకు థియేటర్కు వచ్చిన వాళ్లంతా ఉద్వేగంగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు సినిమా చివరలో వచ్చే టైటిల్స్ వరకు అలాగే చూస్తూ కూర్చుంటున్నారు. సినిమా చూసిన సందీప్ తల్లిదండ్రులు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. వారు ప్రతి చోటా ప్రివ్యూకు వచ్చారు. ఇంకా ఏమైనా సినిమా ప్రమోషన్ చేయాలంటే వస్తామని అన్నారు. కోల్పోయిన 31 ఏళ్ళ కొడుకును ఇప్పుడు వెండితెరపై వారు చూసుకుంటుంటే ఇంతకంటే వారికి ఏం ఇవ్వగలం అనిపించింది. వారికి జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇవ్వగలిగాం. ఒక ఎంబీఏ స్టూడెంట్ నుంచి ఇలాంటి సినిమా నిర్మించే స్థాయికి రావడం సంతోషంగా ఉంది. సినిమాల మీద ప్యాషన్ మమ్మల్ని నడిపిస్తూ ఉంది. త్వరలో మా సంస్థ నుంచి మరిన్ని చిత్రాలు వస్తాయి’ అన్నారు.