మంచిర్యాలలో రెండు గంటల పాటు వర్షం
జలమయమైన రోడ్లు..
రాకపోకలకు ఇబ్బందులు
పిడుగుపాటుకు 18 మేకలు,లేగదూడ మృతి
మంచిర్యాల అర్బన్/మంచిర్యాల ఫొటో గ్రాఫర్/ మందమర్రి రూరల్/భీమారం/చెన్నూర్ రూరల్, జూన్ 26 : మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడా జోరువాన కురిసింది. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం రెండుగంటల పాటు ఎడతెరిపి లే కుండా వర్షం పడింది. రోడ్లన్నీ జలమయం కాగా, వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడా ల్సి వచ్చింది. జిల్లాకేంద్రంతో పాటు సీసీసీ, శ్రీరాంపూర్, జైపూర్, భీమారం, చెన్నూర్లోనూ భారీ వర్షం కురిసింది. మందమర్రి ఏరియాలోని కేకే ఓసీలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు ప్రాజెక్టు అధికారి రమేశ్ తెలిపారు. వర్షం కారణంగా రెండో షిప్టు, రాత్రి షిప్టులలో ఉత్పత్తి నిలిచిందన్నారు. రెండు షిప్టుల్లో 4వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, 40వేల టన్నుల మట్టితీత పనులకు అంతరాయం కలిగిందని వివరించారు. చెన్నూర్ మండలం బుద్దారంలో మొగిలి చిన్న ఐల్లయ్యకు చెందిన 18 మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. భీమారం మండలం పోతన్పల్లిలో ఇసంపల్లి పోశంకు చెందిన లేగ దూడ పిడుగుపాటుకు దూడ అక్కడిక్కడే మృతి చెందింది. దాని విలువ రూ.15 వేలు ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.