మహేష్బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాపై దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. టైమ్ ట్రావెల్, మైథాలజీ అంశాలను కలబోసి అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్బాబు శివ భక్తుడు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. రామాయణ కాలం నాటి ఘట్టాలు కథలో కీలకంగా ఉండబోతున్నాయి.
తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది. క్రీ.పూ 7000 సంవత్సరాల క్రితం మొదలయ్యే ఈ కథ వర్తమానం వరకు వివిధ కాలాల్లో పయనిస్తూ సాగుతుందని తెలిసింది. అయితే ఈ సినిమాలో టైమ్ ట్రావెల్కు ప్రత్యేకమైన మిషన్లాంటిది ఏదీ ఉండదని, కాలాన్ని దాటి వేల సంవత్సరాల చరిత్రలోకి కథానాయకుడు ఎలా వెళ్లాడనే అంశమే అత్యంత ప్రధానంగా ఉంటుందని చెబుతున్నారు. పురాణాలు, చరిత్ర, భవిష్యత్తును అనుసంధానించిన ఈ కథలో ప్రేక్షకుల్ని అబ్బురపరిచే అంశాలెన్నో ఉంటాయని సమాచారం. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు చిత్ర ప్రధాన తారాగణం.