హైదరాబాద్ : అతి వేగం, నిర్లక్ష్యం వల్లే సాయిధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) కు ప్రమాదం జరిగిందని మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రోడ్డు వైపు వెళ్తుండగా సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి ( TS07GJ1258 ) గురైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో సాయి చికిత్స పొందుతున్నారు.
సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్కు సంబంధించిన ప్రాథమిక వివరాలను మాదాపూర్ డీసీపీ శనివారం మీడియాకు వెల్లడించారు. ట్రింప్యూ బైక్ను బూర అనిల్ కుమార్ (ఎల్బీనగర్) నుంచి సాయిధరమ్ తేజ్ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత కూడా ఆ బైక్ అనిల్ కుమార్ పేరుతోనే రిజిస్ట్రేషన్ అయి ఉంది. గతేడాది ఆగస్టు 2న ఈ బైక్పై రూ. 1135 జరిమానా విధించారు. మాదాపూర్లో 40 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న రోడ్డులో 87 కిలోమీటర్ల వేగంతో వెళ్లినందుకు పై జరిమానా విధించినట్లు తేలింది. అయితే నాడు విధించిన రూ. 1135 జరిమానాను ఇవాళ ఎవరో ఎవరో చెల్లించారు.
దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిపై వేగ పరిమితి కేవలం 30 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే. కానీ నిన్న కేబుల్ బ్రిడ్జిపై సాయిధరమ్ తేజ్ తన బైక్పై 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లాడు. ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 75 కి.మీ. వేగంతో ఉంది. సాయిధరమ్ తేజ్కు కార్లు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు విచారణలో తేలింది. బైక్ నడిపేందుకు లైసెన్స్ ఉందో లేదో తేలాల్సి ఉంది. అందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని డీసీపీ తెలిపారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ స్పష్టం చేశారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి – గచ్చిబౌలి రోడ్డులో వేగ పరిమితి బోర్డులు ఏర్పాటు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. మాదాపూర్ జోన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మాదాపూర్ జోన్లో ఈ ఏడాది 17,917 బైక్లకు జరిమానా విధించాం. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,495 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మాదాపూర్ డీసీపీ కోరారు.