‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల సమయాన్ని పొడిగించారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న రెండు ప్యానెళ్ల కోరిక మేరకు పోలింగ్ సమయాన్ని గంట సేపు పొడిగిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటల వరకూ 545 మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గతంతో పోలిస్తే పోలింగ్ శాతం ఈ ఎన్నికల్లో పెరిగింది. 2017-2019 ఎన్నికల్లో మొత్తం పోలైంది కేవలం 442 ఓట్లేకాగా, ఈ సారి మధ్యాహ్నం 2 గంటలకే 545 మంది ఓటు వేశారు. మరో 50 మంది ఓటు వేసేందుకు క్యూలో ఉన్నారు. ఈ క్రమంలోనే పోలింగ్ సమయాన్ని మరో గంటసేపు పెంచాలని రెండు ప్యానెళ్లు అభ్యర్థించాయి.
దీనికి ఎన్నికల కమిషన్ కూడా ఆమోదం తెలిపింది. పోలింగ్ కోసం క్యూలో కనీసం 50 మంది ఉన్నారని, ఎలా లేదన్నా మరో 100 ఓట్లు పోలవుతాయని అధ్యక్ష పోటీలో ఉన్న మంచు విష్ణు చెప్పారు. పలు రాష్ట్రాల నుంచి నటులంతా వచ్చి ఓట్లు వేశారని వెల్లడించారు.