Abhishek Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తనయుడు రాజకీయరంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తున్నది. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన బరిలోకి దింపేందుకు సమాజ్ వాదీ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందుకు ఆ పార్టీ స్థానిక ఆఫీస్ బేరర్ల నుంచి ఫీడ్బ్యాక్ను తీసుకుంటున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ త్వరలో ముంబయి వెళ్లి అమితాబ్ బచ్చన్, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభిషేక్ ఎన్నికల బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా మారనున్నది. అయితే, అమితాబ్కు అలహాబాద్కు ప్రత్యేక అనుబంధం ఉన్నది. అభిషేక్కు సైతం ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఎస్పీ అభ్యర్థిగా నిలిస్తే ఎన్నికల ప్రచారానికి బిగ్బీ అమితాబ్, జయా బచ్చన్తో పాటు ఐశ్వర్యరాయ్ సైతం ఇక్కడికి వచ్చే అవకాశాలున్నాయి.
అమితాబ్ బచ్చన్ 1984 లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రముఖ నేత హేమవతి నందన్ బహుగుణను ఓడించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. ఆ ఎన్నికల్లో అమితాబ్కు 68శాతం ఓట్లు రాగా, బహుగుణకు 25 శాతం ఓట్లే పోలయ్యాయి. అభిషేక్ అభ్యర్థిత్వంపై మయునాపర్ అధ్యక్షుడు పప్పులాల్ నిషాద్ స్పందిస్తూ.. ఇది కేవలం చర్చ మాత్రమేనని.. ఏదైనా ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుందన్నారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని మెట్రోపాలిటన్ అధ్యక్షుడు సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేన్ పేర్కొన్నారు. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనేది జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోనే ఖరారవుతుందన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ రీటా బహుగుణ జోషికి టికెట్ ఇస్తే 1984 నాటి సీన్ అలహాబాద్లో నాటి సీన్ మరోసారి కనిపించనున్నది. వాస్తవానికి డాక్టర్ రీటా బహుగుణ జోషి త్రండి హేమవతి నందన్ బహుగుణ లోక్దళ్ నుంచి, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈ సారి రీటా, అభిషేక్ బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా మారనుంది.