‘కథానాయికగా నా తొలి సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్లో చేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది కశిష్ఖాన్. ఆమె హీరోయిన్గా తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న చిత్రం ‘అనుభవించు రాజా’. రాజ్తరుణ్ హీరోగా నటించారు. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో కశిష్ఖాన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘వినోదం, యాక్షన్, ఎమోషన్స్తో సాగే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. పక్కింటి అమ్మాయి తరహాలో నా పాత్ర వైవిధ్యంగా సాగుతుంది. నటనాపరంగా నాకు ఎలాంటి పూర్వానుభవం లేదు. లైట్స్, కెమెరా అనే పదాలు కూడా వినలేదు. రాజ్తరుణ్, దర్శకుడు శ్రీనుగవిరెడ్డి సహకారం వల్లే నా పాత్రకు న్యాయం చేయగలిగా. షూటింగ్ ప్రారంభం కావడానికి రెండు వారాల ముందు తెలుగు డైలాగ్స్ మొత్తం నేర్చుకున్నా. కామెడీతో పోలిస్తే ఎమోషన్స్ను పలికించడం కష్టమైంది. నటులైతే భిన్న జీవితాల్ని తెరపై చూసుకునే అవకాశం దక్కుతుంది. అందుకే నటనను కెరీర్గా ఎంచుకున్నా. రవితేజ నా అభిమానకథానాయకుడు. పాత్రల పరంగా నాకు ఎలాంటి పరిమితులు లేవు’ అని చెప్పింది.