ముంబై : లెజెండరీ సింగర్, భారతరత్న లతా మంగేష్కర్(92)కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొవిడ్ నిర్ధారణతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ప్రయివేటు ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్కు కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు ఆమె బంధువులు వెల్లడించారు. వయసు రీత్యా ముందస్తు జాగ్రత్తగా లతాను ఆస్పత్రిలో చేర్పించినట్లు స్పష్టం చేశారు. సింగర్ ఆరోగ్యాన్ని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వైద్యం అందిస్తున్నారు.
2019, నవంబర్లో లతా మంగేష్కర్కు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగానే లతా మంగేష్కర్కు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తినట్లు ఆమె సోదరి ఉషా నాడు తెలిపారు.
గతేడాది సెప్టెంబర్లో లతా మంగేష్కర్ 92వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్కు ప్రముఖులతో పాటు మ్యూజిక్ లవర్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లతా మంగేష్కర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయురారోగ్యాలతో మరింత కాలం జీవించాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఏడు దశాబ్దాల పాటు ఆమె ఎన్నో వేల పాటలు పాడారు. దాదాపు వెయ్యికి పైగా హిందీ సినిమాల్లో వేల సంఖ్యలో పాటలు ఆలపించారు. తెలుగులోనూ ఆమె పాటలు రికార్డు సృష్టించాయి. ప్రాంతీయ భాషల్లోనే కాకుండా.. విదేశీ భాషల్లోనూ లతా మంగేష్కర్ పాటలు ఆలపించి.. వరల్డ్ మ్యూజిక్ లవర్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. 2001లో లతా మంగేష్కర్ను భారతరత్న అవార్డు వరించింది. ఈ అవార్డుతో పాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పలు జాతీయ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి.