ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘మిమీ’ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది కృతిసనన్. ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంలో నటించిన అలియాభట్తో కలిసి ఆమె ఈ అవార్డును పంచుకుంది. కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికి..ఏ రోజూ నిరుత్సాహపడకుండా సరైన సమయం కోసం వేచి చూశానని పేర్కొంది కృతిసనన్. మోడలింగ్లో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఓ కొరియోగ్రాఫర్ దురుసుగా ప్రవర్తించడంతో బోరున ఏడ్చానని, ఆ రోజులు తనకు ఇంకా గుర్తున్నాయని కృతిసనన్ చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘అవి కెరీర్ తొలి రోజులు. ఒక షో రిహార్సల్స్ కోసం హైహీల్స్ వేసుకొని గడ్డిలో నడుస్తున్నా. అక్కడ నేల సమతలంగా లేకపోవడంతో సరిగ్గా నడవలేకపోయా. అక్కడే ఉన్న కొరియోగ్రాఫర్ నాతో దురుసుగా ప్రవర్తించింది. దాంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ సంఘటన తర్వాత మరింత ధృడ సంకల్పంతో ఇండస్ట్రీలో ప్రయత్నాలు ప్రారంభించాను. నా విజయాలతోనే అలాంటి వారికి బుద్ధి చెప్పాలనుకున్నా. ఇప్పుడు నా టైమ్ వచ్చింది. నాడు విమర్శించిన వారే ఇప్పుడు అభినందనలు తెలుపుతున్నారు. నా దృష్టిలో అదే నిజమైన విజయం’ అని పేర్కొంది.