అలనాటి అగ్రనాయిక మధుబాల జీవితకథలో నటించాలన్నది తన చిరకాల స్వప్నమని చెప్పింది కియారా అద్వాణీ. కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్లో తనకు ప్రవేశముందని, ఈ ఆటలకు సంబంధించి తనలో ఉన్న నైపుణ్యాల్ని వెండితెరపై ప్రదర్శించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. కథానాయికగా అరంగేట్రం చేసి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల అభిమానులతో ముచ్చటించింది కియారా అద్వాణీ. ఈ వేడుకలో సినిమాల విషయంలో తన కలల్ని గురించి కియారా అద్వాణీ వెల్లడిస్తూ ‘కమర్షియల్ సినిమాలతో పోలిస్తే బయోపిక్లు నటీనటులకు చాలెంజింగ్గా నిలుస్తుంటాయి. జీవితకథల్లో నటించడం నాకు ఇష్టమే. ఎవరి పాత్రను చేస్తున్నామో వారి జీవితంలోని సంఘర్షణను, సారాన్ని అర్థంచేసుకుంటూ నటిస్తేనే బయోపిక్లకు న్యాయం చేయగలం. కేవలం వారి హావభావాల్ని అనుకరిస్తే సరిపోదు. మధుబాల జీవితకథలో నటించాలన్నది నా కల. ఎప్పటికైనా ఆ కోరిక తీరుతుందనే నమ్మకముంది’ అని తెలిపింది. అలాగే ‘స్కూల్డేస్లో స్విమ్మింగ్, బాస్కెట్బాల్, త్రోబాల్ టీమ్లలో నేను ప్లేయర్గా ఉండేదాన్ని. మార్షల్ ఆర్ట్స్లో నాకు ప్రవేశముంది. నాలోని ప్రతిభను చాటుకునేలా పూర్తిస్థాయి క్రీడానేపథ్య, యాక్షన్ సినిమా చేయాలనుంది’ అని కియారా చెప్పింది.