కొందరు బాలీవుడ్ హీరోల వైఖరి వల్లే హిందీ సినిమా ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నదని అన్నారు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్జోహార్. గత ఏడాది హిందీ చిత్రసీమ నష్టాలు పాలుకావడానికి భారీ బడ్జెట్లే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు కోట్ల ఓపెనింగ్స్ కలెక్షన్స్ రాబట్టలేని హీరోలు 30-40 కోట్ల పారితోషికాల్ని డిమాండ్ చేయడం అర్థం లేదన్నారు.
‘బాలీవుడ్లో చాలా మంది హీరోలు తామే సూపర్స్టార్స్ అనే భ్రమలో బతుకుతున్నారు. బయట వారిని చూడటానికి జనం ఎగబడటంతో అదే స్థాయిలో టికెట్లు కూడా తెగుతాయని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. హీరోలు భ్రమల నుంచి బయపడి వాస్తవమేమిటో అవగతం చేసుకోవాలి’ అని కరణ్జోహార్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త హీరోలను భారీ బడ్జెట్ చిత్రాల ద్వారా లాంచ్ చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని, ఓటీటీని దృష్టిలో పెట్టుకొని నూతన తారలను పరిచయం చేస్తే బాగుంటుందని కరణ్జోహార్ సూచించారు. గత కొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమ దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నదని, అన్ని విభాగాల్లో టాలీవుడ్ ముందున్నదని ఆయన ప్రశంసించారు.