Kangana Ranaut | బాలీవుడ్ నటి పంజాబ్ – హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పరువు నష్టం కేసులో భటిండా కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఉపశమనం కోసం కోర్టు మెట్లెక్కింది. కంగనా పిటిషన్పై ఈ నెల 11న విచారణ జరుగనున్నది. గతేడాది జనవరిలో భటిండాలో కంగనాపై పరువు నష్టం ఫిర్యాదు అందింది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భటిండాకు చెందిన మొహిందర్ కౌర్ ఫొటోను షేర్ చేస్తూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
రూ.100 కూలీ ఇచ్చి రైతుల ఉద్యమంలోకి తీసుకువచ్చినట్లు ట్వీట్ చేసింది. ఆ తర్వాత కంగనాపై విమర్శలు వెల్లువెత్తగా.. ఆ తర్వాత ట్వీట్ను తొలగించింది. ఆ తర్వాత పంజాబ్కు వెళ్లిన సమయంలో కంగనాను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో భటిండా కోర్టులో కంగనాపై మొహింద్ కౌర్ జనవరి 4, 2021న పరువు నష్టం కేసు వేశారు. ఆ తర్వాత విచారణ దాదాపు 13 నెలల పాటు కొనసాగింది. ఈ కేసులో కంగనాకు సమన్లు జారీ చేసిన కోర్టు.. బాలీవుడ్ నటిని కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది.
అయితే, ఆ సమయంలో మొహింద్ కౌర్ తనకు 13 ఎకరాల భూమి ఉందని, ఇప్పటికీ తన కుటుంబంతో కలిసి కష్టపడుతున్నట్లు కంగనాకు బదులిచ్చింది. కంగనాకు కరోనా సమయంలో పనిలేకపోతే తనకు వద్దకు రావొచ్చునంటూ మొహిందర్ కౌంటర్ ఇచ్చింది. పొలంలో పని చేసినందుకు ప్రతిఫలంగా కంగనాకు వేతనం చెల్లిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ చెప్పింది. కంగనా చేసిన ట్వీట్ తనను మానసికంగా ఇబ్బందికి గురి చేసిందని, తన ప్రతిష్ట దెబ్బతిందని పిటిషన్లో మొహిందర్ కౌర్ ఆరోపించారు.