‘కల్కి 2898 ఏడీ’ సినిమా విషయంలో ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘ఇప్పటివరకూ తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు.. పాన్ వరల్డ్ సినిమా. ఇండియన్ టాప్స్టార్స్ అయిన అమితాబ్, కమల్హాసన్, ప్రభాస్లకు మాటలు రాసే అదృష్టాన్ని నాకు ఇచ్చింది ఈ సినిమా’ అని చెప్పారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇందులో కథానాయికగా దీపిక పదుకోన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే దుల్కర్ సల్మాన్, పశుపతి, దిశాపటానీ ఇలా పెద్ద పెద్ద స్టార్లు ఇందులో భాగం అయ్యారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించారనేది తాజా వార్త. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ‘సినిమా నిర్మాణాల్లో చాలా మార్పులు వచ్చాయి. వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. ఆ అంకెలు వింటేనే భయమేస్తుంది. తాజాగా ప్రభాస్ ‘కల్కి’ సినిమాలో నటించాను. అలాగే మహేశ్బాబుతో కూడా ఓ సినిమా చేస్తున్నాను’ అని తెలిపారు రాజేంద్రుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మే 9న సినిమా విడుదల కానుంది. ఈ లోపు ఇంకెంతమంది ఈ ప్రాజెక్ట్లో చేరతారో చూడాలి.