హైదరాబాద్: నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 4 గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కైకాల మృతితో ఆయన స్వగ్రామం గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సత్యనారాయణ మరణవార్త తెలవడంతో ఆయన బంధువులు హైదరాబాద్ బయలుదేరారు.
స్వగ్రామం కౌతవరం, నటుడిగా జన్మనిచ్చిన గుడివాడ అంటే కైకాలకు అంతులేని అభిమానం. కౌతవరంలో తాను పుట్టిపెరిగిన ఊరిచెరువు పరిసరాలను చూసి గత జ్ఞాపకాలను నెమరువేసుకునేవారు. సొంతూరు కౌతవరం అభివృద్ధికి రూ.లక్షలు ఖర్చుచేశారు. తరచుగా గ్రామానికి వచ్చి చిన్ననాటి మిత్రులను కలుస్తుండేవారు. కైకల అంత్యక్రియలను శనివారం ఉదయం హైదరాబాద్లోని మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు.