సమాజంలోని ప్రతి ఒక్కరికి విద్యాఫలాలు అందాలని, అందుకు గురువులు మార్గదర్శనం చేయాలనే సామాజికాంశంతో రూపొందిన ‘సార్’ చిత్రం చక్కటి ఆదరణ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలగంగాధర్ తిలక్ అనే స్ఫూర్తివంతమైన ఉపాధ్యాయుడి పాత్రను పోషించారు హీరో ధనుష్. నిజజీవితంలో కూడా అలాంటి గురువుగా పేరు తెచ్చుకున్న కుమురం భీం జిల్లా కెరమెరి మండలం సావర్ఖేడ్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కేడర్ల రంగయ్యను ‘సార్’ చిత్ర బృందం హైదరాబాద్లో సత్కరించింది.
కేడర్ల రంగయ్య ఉపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 60 మాత్రమే. కానీ తనదైన కృషితో ఆ సంఖ్యను 260కి చేర్చారాయన. చిన్న వయసులోనే ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తాజాగా ఆయన్ని ‘సార్’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు తనని తాను తెరపై చూసుకున్నట్లుందని కేడర్ల రంగయ్య ఆనందం వ్యక్తం చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం గత నెల 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది.