కాశీనాథుని విశ్వనాథ్ ఆయన అసలు పేరు.. కళాతపస్వి మారుపేరు. గ్లామర్ దుమారంలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు ఆయన సరికొత్త గ్రామరు నేర్పారు. సంగీతనాట్యాలకు పట్టం కట్టారు. తెలుగుదనాన్ని సమున్నతంగా నిలబెట్టారు. ఆయన సినిమాల్లో కథాకథనాలే హీరో హీరోయిన్లు. ఆయన తిప్పిన మలుపుతో తెలుగు సినిమా గుండెల్లో నాదం ఝుమ్మంటే, పాదం సై అంది. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం.. ఇలా ఒక్కో సినిమా తెలుగు సినిమా కీర్తిని దశదిశలా చాటింది. ప్రాంతీయంగా మొదలైన ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ ఎల్లలు దాటింది. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులే కాదు అవార్డులు, రివార్డులు ఎదురు చూసేవి. తెలుగు సినిమాను ఆస్కార్ అంచుల దాకా తీసుకువెళ్లిన ఘనకీర్తి ఆయన సొంతం. మెండైన సినిమాలు తీశారు. నిండైన జీవితాన్ని చూశారు. కళాఖండాలకు చిరునామాగా మారిన కే విశ్వనాథ్ కానరాని లోకాలకు తరలిపోయారు. వెండితెర వెలవెల పోయింది. ప్రేక్షకలోకం ‘దొరకునా.. ఇటువంటి దర్శకుడ’ని శోకసంద్రంలో మునిగింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తెలుగు సినిమాకి సాంస్కృతిక తేజాన్ని, ఉత్తేజాన్ని నింపిన కళాతపస్వి కే విశ్వనాథ్(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అపోలో దవాఖానలో చికిత్సపొందుతూ గురువారం రాత్రి చివరిశ్వాస వదిలారు. ఆయనకు జాతీయస్థాయిలో ఎంతో పేరు తెచ్చిన శంకరాభరణం 1980 ఫిబ్రవరి 2న విడుదలైంది. అదేరోజైన గురువారం యాదృచ్ఛికంగా కన్నుమూశారు. విశ్వనాథ్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి, సత్యవతి రాథోడ్, సినీనటుడు చిరంజీవి, పలువురు సంతాపం తెలిపారు. విశ్వనాథ్కు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలుగులో 41, హిందీలో 10 సినిమాలకు దర్శకత్వం వహించారు.
‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్
కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పెద్దపులివర్రులో జన్మించారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం, తల్లి సరస్వతమ్మ. బాల్యం నుంచి చదువుల్లో చురుగ్గా ఉన్న విశ్వనాథ్, అప్పట్లోనే రామాయణ, భారత, భాగవతాలు చదివేశారు. ఏ పుస్తకం కనిపించినా, చదువుతూపోయేవారు. గుంటూరు హిందూకాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన విశ్వనాథ్, అదే ఊరిలోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం విజయవాహినీ సంస్థలో పనిచేసేవారు. దాంతో డిగ్రీ పూర్తి కాగానే విజయవాహిని స్టూడియోలో సౌండ్రికార్డిస్ట్గా చేరారు. విజయా సంస్థ నిర్మించిన ’పాతాళభైరవి’కి అసిస్టెంట్ రికార్డిస్ట్గా పనిచేశారు.
దర్శకత్వం దిశగా..
విశ్వనాథ్కు తొలి నుంచీ కళారాధన అధికం. సకల కళలకూ నెలవైన విశ్వనాథుని పేరుపెట్టుకున్న ఆయన మనసు దర్శకత్వం వైపు మళ్లింది. ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్గా చేరారు. కొన్ని చిత్రాలకు కథారచనలో పాలు పంచుకున్నారు. అలా అన్నపూర్ణ సంస్థలో రాణిస్తున్న రోజుల్లోనే ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావును విశ్వనాథ్ పనితనం ఆకర్షించింది. ఆత్మగౌరవం’ చిత్రంతో కే విశ్వనాథ్ను దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. తొలి చిత్రంలోనే తనదైన బాణీని ప్రదర్శించారు విశ్వనాథ్. నాటి మేటినటులు ఎన్టీఆర్, ఏఎన్నార్తో చిత్రాలు రూపొందించారు. అప్పటి వర్ధమాన కథానాయకులు కృష్ణ, శోభన్బాబుతోనూ మురిపించే సినిమాలు అందించారు. తన చిత్రాలలో ఏదో వైవిధ్యం ప్రదర్శించాలని తొలి నుంచీ తపించేవారు. అందుకు తగ్గట్టుగానే కథలను ఎంచుకొనేవారు. తెలుగునాట శోభన్బాబు, చంద్రమోహన్, కమల్హాసన్ వంటివారు స్టార్డమ్ పొందటానికి ఆయన చిత్రాలు కారణమయ్యాయి.
భారతీయ కళలే కథాంశాలు
భారత చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అతికొద్ది మంది దర్శక దిగ్గజాల్లో విశ్వనాథ్ ఒకరు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, శాస్త్రీయ కళలను వెండితెరపై అద్భుతమైన దృశ్యకావ్యాలుగా మలిచారు. ఫక్తు కమర్షియల్ రంగమైన సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఎంచుకోవడానికి సాహసించని భారతీయ కళలను సినిమాలుగా మలిచి అందరి అభిప్రాయాన్ని తప్పని నిరూపించారు. ఆయన దర్శకత్వం వహించిన శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం బాక్సాఫీస్ను బద్దలు కొట్టాయి. కళలేగాక సామాజిక సమస్యలపై కూడా విశ్వనాథ్ ఎన్నో సినిమాలు రూపొందించారు. స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం ఈ కోవలోనివే. సినిమాల ట్రెండ్ మారటంతో దర్శకత్వానికి స్వస్తిచెప్పి నటుడిగా మారి ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్లో నటించి మెప్పించారు.
2002లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో ఆయన నటుడిగా మారారు. 2012లో వచ్చిన జీనియస్ చివరి సినిమా. దాదాపు 20కిపైగా సినిమాల్లో నటించారు. శుభసంకల్పం, నరసింహానాయుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్, కలిసుందాం రా వంటి సినిమాల్లో ఆయన నటించిన పాత్రలు ఎంతో సజీవంగా ప్రేక్షకుల మనస్సులో మిగిలిపోయాయి. కళాత్మక సినిమాలు తీయడంతో ఇండస్ట్రీ ఆయనను కళాతపస్వి అని కితాబిచ్చింది. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి 1992లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. అదే ఏడాది పద్మశ్రీ అవార్డు కూడా వరించింది. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు.
కే విశ్వనాథ్ కీర్తి అజరామరం: సీఎం కేసీఆర్
ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే విశ్వనాథ్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు కే విశ్వనాథ్ అని కొనియాడారు. గతంలో కే విశ్వనాథ్ ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. భారతీయ సామాజిక సంస్కృతి సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్దపీట వేశారని సీఎం పేర్కొన్నారు.
సంగీత, సాహిత్యాలను ప్రధాన ఇతివృత్తంగా మానవ సబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా, దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కే విశ్వనాథ్ అని అన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికితురాయిగా నిలిచాయని పేర్కొన్నారు. కవి పండితులకు జనన, మరణ భయం ఉండదని, వారి కీర్తి అజరామరం అని ‘జయన్తి తే సుకృతినో.. రససిద్ధాః కవీశ్వరాః నాస్తియేషాం యశః కాయే జరామరణజం భయమ్’ అనే వాక్కు విశ్వనాథ్కు వర్తిస్తుందని తెలిపారు.
కలిసి సినిమా చేద్దాం సర్: సీఎం కేసీఆర్
తెలుగు చిత్రపరిశ్రమ దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ తెలుగు ప్రజలకు కలకాలం నిలిచిపోయే అపురూప చిత్రాలను అందించారు. ఆయనకు అభిమాని కాని తెలుగు వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. విశ్వనాథ్కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కూడా వీరాభిమాని. విశ్వనాథ్ చిత్రాలన్నింటిని వదిలిపెట్టకుండా చూస్తానని కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. 2019 ఆగస్టు 11న కేసీఆర్ స్వయంగా విశ్వనాథ్ నివాసానికి వెళ్లి, ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగు భాష, సాహిత్యంపై ఇరువురు అరగంటపాటు చర్చించారు. ‘నేను మీకు వీరాభిమానిని సర్. చిన్నప్పటి నుంచి మీ చిత్రాలన్నింటిని వదిలిపెట్టకుండా చూసేవాడిని. శంకరాభరణం సినిమాను 25 సార్లు చూశాను. ఇప్పటికీ వీలుచిక్కినప్పుడల్లా మీ సినిమాలు చూస్తూనే ఉంటాను.
సినిమా చూస్తున్నప్పుడు మిమ్మల్ని కలవాలని అనుకొంటాను. ఇంతకాలానికి నా కోరిక తీరింది. మీరు రూపొందించిన ప్రతి సినిమా ఓ మధుర పద్యంలా ఉంటుంది. ఒక తపస్విలా మీరు సినిమాలు తెరకెక్కిస్తారు. మీ సినిమాలోని ప్రతి చిన్న అంశం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కుటుంబం మొత్తం ఒకచోట కూర్చొని చూడగలిగేవి మీ చిత్రాలే. గత పదేండ్లుగా మీరు సినిమాలు తీయటంలేదని తెలిసింది. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉంటే మీతో ఒక సినిమా రూపొందించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం అంత మంచి సినిమాలు రావటం లేదు. మీరు మళ్లీ ఓ అద్భుత సినిమా చేయాలని కోరుకొంటున్నా’ అని సీఎం కోరారు. కానీ, విశ్వనాథ్ అనారోగ్యంగా ఉండటంతో ఆ ప్రతిపాదన వాస్తవరూపం దాల్చలేదు.