దక్షిణాది చిత్ర పరిశ్రమతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడి ప్రేక్షకులు చూపించిన ప్రేమను మర్చిపోలేమని, తెలుగు సినిమాలో నటించాలని ఉందని తెలిపింది బాలీవుడ్ తార జాన్వీ కపూర్. తన కొత్త సినిమా ‘మిలి’ రేపు విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ….‘నా కెరీర్లో ఎక్కువ శ్రమించిన చిత్రమిదే. కథానుసారం ఫ్రీజర్ గదిలో గంటలపాటు గడపాల్సివచ్చింది. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడ్డాను.
అమ్మ శ్రీదేవి దిగ్గజ నాయికగా పేరు తెచ్చుకుంది. ఆమె వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చినందుకు గర్వపడుతున్నా. దక్షిణాది ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. తెలుగుతో పాటు సౌత్ సినిమాల్లో నటించాలని ఉంది. గతంలో ఇక్కడ కొన్ని అవకాశాలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్ సరసన నటించాలని ఉంది’ అని చెప్పింది.