Actress Jacqueline | ఆర్థిక నేరగాడు, రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్మాండెజ్ సొమ్మును తీసుకొని వినియోగించుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మనీలాండరింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలని జాక్వెలిన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ ధర్మాసనం ముందు ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, ఈడీ దాఖలు చేసిన అఫిడవిట్కు రీజాయిండర్ దాఖలు చేసేందుకు నటి తరఫు న్యాయవాది కోరారు. సుకేశ్ చంద్రశేఖర్తో జరిగిన ఆర్థిక లావాదేవీలపై బాలీవుడ్ నటి ఎప్పుడూ వాస్తవాలను వెల్లడించలేదని, వాస్తవాలను దాచిపెడుతూ వచ్చిందని ఈడీ అఫిడవిట్లో పేర్కొంది.
ఇప్పటికీ ఆమె సత్యాన్ని దాస్తోందని ఆరోపించింది. సుకేశ్ చంద్రశేఖర్ మొబైల్ ఫోన్ నుంచి మొత్తం డేటాను తొలగించి.. తద్వారా సాక్ష్యాలను తారుమారు చేసింది కూడా నిజమేనని చెప్పింది. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆస్వాదిస్తుందని ఈడీ తెలిపింది. మొదట్లో తన వాంగ్మూలంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాను సుకేశ్ బాధితురాలని పేర్కొంటూ నిజాలను దాచేందుకు ప్రయత్నించిందని.. విచారణలో వేధింపులను రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలను చూపించడంలో విఫలమైందని ఈడీ స్పష్టం చేసింది. సుకేశ్ చంద్రశేఖర్ నేర నేపథ్యం గురించి ఆమెకు తెలుసునని ఈడీ చెప్పింది.
తొలుత జాక్వెలి తన కుటుంబం కోసం దేశ విదేశాల నుంచి భారీ మొత్తంలో డబ్బు, విలువైన బహుమతులు అందుకున్నట్లు అంగీకరించలేదని, లగ్జరీ వస్తువులు క్రిమినల్ కార్యకలాపాల ద్వారా ఉత్పన్నమైన నేరాల ఆదాయం కాదని చెప్పిందని ఈడీ అఫిడవిట్లో పేర్కొన్నది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసులో తనను ప్రాసిక్యూషన్ సాక్షిగా హాజరుపరిచారని, నిందితుడిగా నేర్చలేదని జాక్వెలిన్ చేసిన వాదనలను ఈడీ కొట్టిపడేసింది. చంద్రశేఖర్ నేర చరిత్ర గురించి, లీనా మారియా పాల్ అతని భార్య అనే విషయం కూడా బాగా తెలుసునని, అయినా సంబంధాన్ని కొనసాగిస్తూ ఆర్థిక ప్రయోజనాలను జాక్వెలిన్ పొందినట్లుగా ఈడీ చెప్పింది.