Jacqueline Fernandez | గ్యాంగ్స్టర్ సుకేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు సైతం ఉన్నది. ఈ వ్యవహారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పలుసార్లు విచారించింది. మనీలాండరింగ్ కేసు సంబంధించి ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను రద్దు చేయాలని శ్రీలంకన్ బ్యూటీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం ఢిల్లీ హైకోర్టు ఈడీ స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ జ్యోతిసింగ్ ఈడీకి నోటీసులు ఇచ్చారు. కేసు విచారణను జనవరి 29వ తేదీకి వాయిదా వేసింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్తో పాటు ఈడీ ఛార్జ్ షీట్లను కొట్టివేయాలని జాక్వెలిన్ పిటిషన్లో పేర్కొంది. కేసులో దాఖలు చేసిన ఈడీ ఛార్జిషీట్లలో తనను నిందితురాలిగా చూపించడాన్ని వ్యతిరేకించింది. ఈ కేసులో మొదట తనను సాక్షిగానే కోర్టులో హాజరు పరిచిన విచారణ అధికారులు, ఆ తర్వాత నిందితురాలిగా చేర్చారని వాపోయింది. సుకేశ్ చంద్రశేఖర్ మోసాల విషయం తనకు తెలియదని పేర్కొంది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలు ఉన్నాడు. అతనిపై 30కిపైగా కేసులు నమోదయ్యాయి. జైల్లో ఉంటూనే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అధికారిగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు. ఢిల్లీకి చెందిన వ్యాపారికి బెయిల్ ఇప్పిస్తానని అతని భార్య నుంచి ఏకంగా రూ.215 కోట్లు కొల్లగొట్టాడు. ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్నాడు.
సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే సుకేశ్, జాక్వెలిన్ క్లోజ్గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విచారణ సమయంలో జాక్వెలిన్తో డేటింగ్లో ఉన్నట్లు సుకేశ్ ఈడీ అధికారులకు తెలిపాడు. ఆ తర్వాత జాక్వెలిన్ను సైతం కేసులో నిందితురాలిగా చేర్చారు. తనను కావాలనే కేసులో ఇరికించారని జాక్వెలిన్ ఆరోపించింది. సుకేశ్ తనన జీవితాన్ని నాశనం చేశాడని, కెరీర్తో ఆడుకున్నాడని వాపోయింది. జైలులో ఉన్నా తనతో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడేవాడన్న నటి.. ఏనాడూ తాను జైల్లో ఉన్నట్లుగా తెలుపలేదని పేర్కొంది.