అర్థవంతమైన చిత్రాల్లో నటిస్తూ ప్రతిభ గల నటిగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. భాషలే కాదు యాసలూ నేర్చుకుని ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఏడాదికి కనీసం రెండు మూడు చిత్రాల్లో మెరిసేదీ నాయిక. అయితే ఒక్క ఏడాదిలోనే ఆమె కెరీర్ డల్ అయ్యింది. సాయి పల్లవి నటించిన గత మూడు చిత్రాలు ‘శ్యామ్ సింగరాయ్’, ‘విరాటపర్వం’, ‘గార్గి’ ఆశించిన విజయాలు సాధించలేదు. ఇవన్నీ వైవిధ్యమైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నా బాక్సాఫీస్ విజయాలు దక్కలేదు. దీంతో సాయి పల్లవికి అవకాశాలు నెమ్మదించాయి. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నదీ తార. దీంతో పాటు తాజాగా ఆమె ఖాతాలో ఓ క్రేజీ సినిమా చేరినట్లు సమాచారం.
అజిత్ హీరోగా నటిస్తున్న 62వ చిత్రంలో నాయికగా సాయి పల్లవిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ చిత్రంలో నాయికలుగా నయనతార, ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా వినిపించాయి. సాయి పల్లవికి ఈ ప్రాజెక్ట్ దక్కితే కోలివుడ్లో ఆమెకు మరికొంత కాలం కెరీర్ వచ్చినట్లే అనుకోవాలి. ఈ సినిమాను దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందిస్తున్నారు. అజిత్ ఇటీవలి సినిమా ‘తునివు’ టాలీవుడ్లో ‘తెగింపు’ పేరుతో విడుదలైంది.