రానున్న ఆస్కార్ పురస్కారాల కోసం మన దేశం నుంచి గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ను పంపించడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలను వదిలేసి రీమేక్గా తెరకెక్కిన ‘ఛెల్లో షో’ సినిమాను ఎలా ఆస్కార్ ఎంట్రీగా పంపిస్తారని వారు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. అన్ని విధాలా గుజరాత్ను ప్రమోట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆస్కార్ లాంటి అంతర్జాతీయ సినిమా పురస్కారాల వేడుకలకూ గుజరాతీ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు.
1988లో దర్శకుడు గుసెప్పీ టార్నటోర్ రూపొందించిన ‘సినిమా పారడైసో’ కథను ఆధారంగా చేసుకుని దర్శకుడు పాన్ నలీన్ ‘ఛెల్లో షో’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ వీడియోలను కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్ట్ చేస్తున్నారు. ఒరిజనల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను వదిలేసి ఎవరికీ తెలియని, జనాదరణ పొందని రీమేక్ ‘ఛెల్లో షో’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) ఆస్కార్కు అఫీషియల్ ఎంట్రీగా పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆశ్చర్యాన్ని కలిగించింది: దర్శకుడు ఎన్ శంకర్
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ ఏ కోణంలో గుజరాతీ ‘ఛెల్లో షో’ చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీగా ఎంపికచేశాయో తెలియదు. అలాంటి చిత్రాలు దక్షిణాదిలో చాలా వచ్చాయి. ఇండియన్ ఆస్కార్ కమిటీకి పనిచేసిన అనుభవం నాకుంది. ఆర్ఆర్ఆర్ను ఆస్కార్కు పంపక పోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.