ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. సాయిరాజేష్ దర్శకుడు. ఎస్.కె.ఎన్ నిర్మాత. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోల్లో ఒకరైన విరాజ్ అశ్విన్ సోమవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు విరాజ్. తొలిసారి నా రియల్ పేరుతో క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉంది. ఇందులో నేను కాలేజీ విద్యార్థిగా కనిపిస్తా. అతను ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా సరదాగా జీవితాన్ని సాగిస్తుంటాడు.
ఈ సినిమాలో ప్రతీ పాత్రకు ఓ బ్యాక్స్టోరీ ఉంటుంది. నా క్యారెక్టర్ ఎందుకు ప్రత్యేకంగా ప్రవర్తించాల్సి వచ్చిందనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఓ అమ్మాయి స్కూల్, కాలేజ్ రోజుల్లోని ప్రేమ కథల నేపథ్యంలో భావోద్వేగభరితంగా ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో ప్రేమ తాలూకు ఉద్వేగాల్ని చాలా సహజంగా చూపించారు. కథానుగుణంగా విజయ్ బుల్గానిన్ అద్భుతమైన పాటలిచ్చారు. నేను ఇప్పటివరకు చూసిన ప్రేమకథా చిత్రాల్లో చాలా ప్రత్యేకంగా అనిపించిన సినిమా ఇది’ అన్నారు..