హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : సృష్టి మనుగడలో సూర్యుడి పాత్ర ప్రాముఖ్యమైనది. సూర్యోదయాన ప్రసరించే కిరణాలు ఆరోగ్యపరంగా ఎంతో మేలుచేస్తాయని ఇదివరకే తేలింది. తాజాగా కొవిడ్ మరణాలను అరికట్టడంలో కూడా సూర్యుడు కీలకపాత్ర పోషిస్తున్నాడని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. సూర్యకిరణాలు.. ముఖ్యంగా అతినీలలోహిత (యూవీఏ) కిరణాలు కొవిడ్ మరణాలను తగ్గిస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావయలెట్ కిరణాలు చర్మంలోపలికి చొచ్చుకుపోయే శక్తిని కలిగి ఉంటాయి. ఎండ వేడిమిలో ఎక్కువగా ఉండేవారు కొవిడ్ కారణంగా మరణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఎడిన్బరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయన వివరాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమయ్యాయి. అమెరికాలో గత ఏడాది జవనరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో కొవిడ్ కారణంగా మరణించిన వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. అవే నెలల్లో అమెరికాలోని 2,474 గ్రామీణ ప్రాంతాలలో నమోదైన అల్ట్రావయలెట్ స్థాయిలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాకు వచ్చారు. ఎండవేడిమి వల్ల చర్మం నుంచి నైట్రిక్ యాసిడ్ విడుదలవుతుందని, ఇది కరోనా వైరస్ తీవ్రతను తగ్గిస్తుందని ఆ అధ్యయనం పేర్కొంది. సూర్యరశ్మి వల్ల గుండె సంబంధిత వ్యాధులు నయమవుతాయని, తక్కువ రక్తపోటు సమస్య పరిష్కారమవుతుందని, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఇదివరకే కొన్ని అధ్యయనాలు ధ్రువీకరించాయి. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటూ సూర్యరశ్మికి గురికాని వారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది.