‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో సామాజిక సంస్కర్త, సంఘ సేవకురాలు హేమలత లవణం పాత్రను పోషిస్తున్నది నటి రేణూ దేశాయ్. రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం రేణూ దేశాయ్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలు..
హేమలత లవణం గొప్ప సామాజిక సేవకురాలు. ఆ రోజుల్లోనే చంబల్, బుందేల్ఖండ్ వంటి బందిపోటు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సంస్కరణలు చేపట్టారు. అంటరానితనం, జోగినీ వ్యవస్థపై పోరాటం చేశారు. అలాంటి గొప్ప మహిళ పాత్రను పోషించడం నా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నా. నేటితరంలో స్ఫూర్తినింపే పాత్ర ఆమెది. ఈ పాత్ర కోసం హేమలత లవణం మేనకోడలిని కలుసుకొని చాలా సమాచారాన్ని సేకరించాను. ఆమె బాడీలాంగ్వేజ్ గురించి తెలుసుకొని అదే విధంగా తెరపై కనిపించే ప్రయత్నం చేశా. అలాగే తెలుగులో కూడా స్పష్టంగా మాట్లాడేలా శిక్షణ తీసుకున్నా.
ఈ పాత్ర నా వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులను తీసుకొచ్చింది. సామాజికంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలనే స్ఫూర్తినిచ్చింది. చిన్నపిల్లలు ఎవరూ ఆకలితో ఉండకూడదన్నది నా లక్ష్యం. నా దిశగా మరిన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా. ఈ సినిమా ట్రైలర్ చూసిన నా కూతురు ‘వయసుకు తగిన పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఉందమ్మా’ అని చెప్పింది. అదే నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నా.
కొడుకుని బిగ్ స్క్రీన్పై చూడాలని ప్రతీ తల్లి కోరుకుంటుంది. అయితే నా కుమారుడు అకీరాను హీరోగా పరిచయం చేయాలనే ఆలోచన ఇప్పటివరకూ రాలేదు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. అతను పియానో నేర్చుకున్నాడు. యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్పై మంచి పట్టుంది. తను హీరో అవ్వాలని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని ముందుగా నేనే ప్రకటిస్తా. నటన పట్ల నాకు ఎప్పుడూ పాషన్ ఉంటుంది. నా వయసుకు తగిన పాత్రలు దొరికితే తప్పకుండా నటిస్తా.