Mrunal Thakur | సినిమా కళాత్మక వ్యాపారం. తారలు తమ క్రేజ్ను బట్టి పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంటారు. ప్రస్తుతం తెలుగు తారాపథంలో దూసుకుపోతున్నది కథానాయిక మృణాల్ ఠాకూర్. దీంతో ఈ భామ పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసిందట. ప్రస్తుతం ఈ సొగసరి ఒక్కో సినిమాను రెండు నుంచి మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నదని తెలిసింది. ‘సీతారామం’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ సుందరి చక్కటి అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
సీత పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని నిర్మాతలు ఆమె డిమాండ్ చేసిన పారితోషికాన్ని ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాని 30వ చిత్రంతో పాటు, విజయ్ దేవరకొండ సరసన కథానాయికగా నటిస్తున్నది.