‘ఏ సినిమాకైనా తొలి హీరోలు దర్శకనిర్మాతలే. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సినిమాను పూర్తిచేస్తారు. అలాంటి తపన, పట్టుదల ఈ చిత్ర యూనిట్లోను కనిపించింది’ అని అన్నారు సీనియర్ దర్శకనిర్మాత ఎం.ఎస్.రాజు. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తాన్యాహోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. గురుపవన్ దర్శకుడు. మహేష్ నిర్మాత. నేడు ఈ చిత్రం విడుదలకానుంది. గురువారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ఫీల్గుడ్ ఎంటర్టైనర్ ఇది. నలుగురు బైక్ రైడర్స్ తమ లక్ష్యాల్ని ఎలా చేరుకున్నారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా కోసం సుమంత్ పడిన కష్టం చూస్తుంటే నా తొలినాటి రోజులు గుర్తొచ్చాయి’ అని పేర్కొన్నారు. ‘ఈ సినిమా ప్రయాణంలో శ్రీకాంత్ నాకో మార్గదర్శిగా నిలిచారు. చక్కటి సలహాలు ఇచ్చారు. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అన్ని ప్రాంతాల సొగసుల్ని ఈ సినిమాతో చూసే అవకాశం దొరికింది’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. పన్నెండేళ్ల కష్టానికి ప్రతిరూపమిదని, రోడ్ జర్నీ అడ్వెంచర్గా ప్రేక్షకులకు చక్కటి థ్రిల్ను పంచుతుందని దర్శకుడు పేర్కొన్నారు. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్లకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రమవ్వాలని సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఆకాంక్షించారు.