లండన్: ప్రస్తుతం కొవిషీల్డ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్లోని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ యూకేలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. 24 కోట్ల పౌండ్ల (సుమారు రూ.2500 కోట్లు) ఈ ప్రాజెక్ట్లో భాగంగా వ్యాక్సిన్లు కూడా తయారు చేసే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. సేల్స్ ఆఫీస్, క్లినికల్ ట్రయల్స్, రీసెర్చ్, డెవలప్మెంట్, కుదిరితే వ్యాక్సిన్ల తయారీ కూడా ఇక్కడ ఉంటుంది అని జాన్సన్ తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీతో సమావేశానికి ముందు ఆయన ఈ ప్రకటన చేశారు.
కరోనా వైరస్ కోసం ముక్కు ద్వారా వేసే ఒకే డోసు వ్యాక్సిన్ ట్రయల్స్ను సీరం ఇప్పటికే యూకేలో ప్రారంభించింది. ఇండియాతో వంద కోట్ల పౌండ్ల ఒప్పందాల్లో భాగంగానే సీరం కూడా ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు బ్రిటన్ తెలిపింది. బ్రెగ్జిట్ తర్వాత వాణిజ్య పరంగా ఇండియానే బ్రిటన్కు ఆశాకిరణంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ నెలలో బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు రావాల్సి ఉన్నా.. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దానిని వాయిదా వేసుకున్నారు. అయితే ఈ కష్ట సమయంలో ఇండియాకు కావాల్సిన అత్యవసర వైద్య సామాగ్రిని బ్రిటన్ అందిస్తోంది.