హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఎన్నికల లొల్లి రోజురోజుకు హీట్ పెంచుతున్నది. రోజూ అసోసియేషన్ సభ్యుల వాదోపవాదాలతో ‘మా’ ఛాంబర్ దద్దరిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ‘మా’ అసోసియేషన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఆ విలేకరుల సమావేశం ఎన్ని గంటలకు జరుగనుంది అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇదిలావుంటే ‘మా’ లోని కొందరు సభ్యులు ఈ వివాదానికి సంబంధించి నిరసనగా దాసరి నారాయణరావు విగ్రహానికి మెమొరాండం ఇవ్వనున్నారని, నరేష్ వర్గం కృష్ణంరాజును కలిసి వినతి పత్రం సమర్పించనుందని కూడా ప్రచారం జరుగుతున్నది.
కాగా, ‘మా’ లో ప్రస్తుత కార్యవర్గం గడువు సెప్టెంబర్ వరకు ఉన్నది. అయితే ‘మా’ లో వర్గపోరు కారణంగా ఎన్నికలు వెంటనే నిర్వహించాలనే డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్నది. ఇంకో విషయం ఏమిటంటే ‘మా’ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ అధ్యక్ష పదవికి ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్నారు. ఆ ఐదుగురిలో ఒకరైన సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ 27 మందితో ప్యానల్ను ప్రకటించారు. ఇక మంచు విష్ణు, నటి జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నసింహారావు ఫ్యానల్స్ ప్రకటించకపోయినా తాము కూడా ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు.