The Kerala Story | వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరుపనున్నది. సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ గతవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. మంగళవారం (మే 15) విచారించేందుకు జాబితా చేసింది. జరల్నిస్ట్ కుర్బన్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిందని.. పిటిషన్పై తక్షణ విచారణ అవసరమని సిబల్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరుగనుండగా.. వివాదాస్పద చిత్రంపై సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అయితే, సినిమాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారించిన సమయంలో కేరళ హైకోర్టు మే 5న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కళాత్మక స్వేచ్ఛ గురించి నొక్కి చెబుతూ.. సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ట్రైలర్ను వీక్షించిన హైకోర్టు ప్రత్యేకంగా కమ్యూనిటీపై దాడి చేసేలా ఏమీ లేదని స్పష్టం చేసింది. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశారని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ సర్టిఫికేషన్ (CBFC) ఇప్పటికే అనుమతి ఇచ్చిందని గుర్తు చేసింది.
వివాదాస్పద చిత్రానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో వాటిలో జోక్యం చేసుకోవడానికి ఈ నెల 4న సుప్రీం తిరస్కరిస్తూ.. ఆయా పిటిషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రజలే అంతిమంగా సినిమా విలువను నిర్ణయిస్తారని వ్యాఖ్యానించింది. అయితే, ఈ వివాదాస్పద చిత్రంపై పలు రాష్ట్రాలు ప్రదర్శనపై బ్యాన్ విధించగా.. చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో సినిమాను బ్యాన్ చేయగా.. తమిళనాడులో ప్రదర్శనను నిలిపివేశారు. బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.