‘వీరసింహా రెడ్డి’ చిత్రాన్ని గొప్ప బాధ్యతగా భావించి తెరకెక్కించానని, తాము ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించిందని చెప్పారు చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం దర్శకుడు గోపీచంద్ మలినేని పాత్రికేయులతో మచ్చటించారు. ఆ విశేషాలివి..
బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం అద్భుత విజయం సాధించింది. అదే సమయంలో ఆయన చేస్తున్న ‘అన్స్టాపబుల్’ షో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా ఆయన యువత, కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ‘వీరసింహా రెడ్డి’ చిత్రాన్ని గొప్ప బాధ్యతగా భావించా. బాలకృష్ణకు ఉన్న గాడ్ ఆఫ్ మాసెస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని కథ సిద్ధం చేశా. అందరికి కనెక్ట్ అయ్యే అంశంగా సిస్టర్ సెంటిమెంట్ను పెట్టాం. సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. రామ్లక్ష్మణ్ ఫైట్స్ను ఎమోషనల్ ఫీల్తో డిజైన్ చేశారు. పోరాట ఘట్టాలన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలొస్తున్నాయి.
అన్నాచెల్లెలు సెంటిమెంట్తో..
బాలకృష్ణ చాలా అందంగా ఉంటారు. ఆయనకు సరైన లుక్ కుదిరితే మరో స్థాయిలో కనిపిస్తారు అనుకున్నాం. బ్లాక్ షర్ట్, బ్లాక్ గ్లాసెస్తో ఫస్ట్ పోస్టర్ను డిజైన్ చేశాం. ఇప్పుడు ఎక్కడ చూసిన బాలకృష్ణ సిగ్నేచర్ ైస్టెల్ బ్లాక్ షర్ట్స్, గ్లాసెస్ వాడుతున్నారు. సినిమాలో అన్నా చెల్లెలు సెంటిమెంట్కు పెద్దపీట వేశాం. వారి మధ్య సెంటిమెంట్ అందరికి కనెక్ట్ అవుతుందని నమ్మాం. సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిస్టర్ పాత్ర కోసం వరలక్ష్మీ శరత్కుమార్ను అనుకున్నప్పుడు బాలకృష్ణ వెంటనే ఓకే చెప్పారు. ఆమె ఆ పాత్రలో జీవించింది.
‘జై బాలయ్య..’ మార్మోగిపోతున్నది
సినిమాలోని సంభాషణలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. డైలాగ్స్ అన్నీ కథలో నుంచి పుట్టినవే. కావాలని ఎక్కడా రాజకీయ సంభాషణల్ని పెట్టలేదు. దర్శకుడిగా నాలో మాస్ యాంగిల్ ఎక్కువ. ఈ కథలో ఆ అంశాలన్నీ పొందుపరిచాను. బాలకృష్ణకు ఓ ఫ్యాన్బాయ్గా ఈ సినిమా చేశా. ఇక సంగీత దర్శకుడు తమన్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తమన్ సంగీతం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఎక్కడకు వెళ్లినా ‘జై బాలయ్య’ పాట మార్మోగిపోతున్నది.
మైత్రీ మూవీ మేకర్స్ ది బెస్ట్
నా కెరీర్లో మైత్రీ మూవీ మేకర్స్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌజ్. ఇక ముందు కూడా వాళ్లతో సినిమాలు చేస్తుంటాను. నా ‘క్రాక్’ సినిమా విడుదల కాకముందే నవీన్గారు నాతో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాంతి సీజన్లో రెండు పెద్ద సినిమాల్ని చక్కటి ప్రణాళికతో రిలీజ్ చేయడం గొప్ప విషయం. ప్రస్తుతం ‘వీరసింహా రెడ్డి’ సక్సెస్ను ఓ అభిమానిగా ఆస్వాదిస్తున్నా. నా తదుపరి చిత్రాల వివరాల్ని త్వరలో వెల్లడిస్తా.