‘ది ఫ్యామిలీమెన్-2’ సిరీస్లో శ్రీలంక తమిళ పోరాటయోధురాలు రాజీ పాత్రలో అద్భుతాభినయం ప్రదర్శించి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలందుకుంది అగ్ర కథానాయిక సమంత. ఈ సిరీస్లో నటనకుగాను ఇటీవల మెల్బోర్న్లో జరిగిన ఓ అంతర్జాతీయ ఫిల్మ్ఫెస్టివల్లో ఉత్తమ నటిగా సమంత పురస్కారాన్ని గెలుచుకుంది. కేవలం ఒకే ఒక సిరీస్తో జాతీయ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకోవడంపై సమంత ఆనందం వ్యక్తం చేసింది. కెరీర్ ఆరంభం నుంచి అందమైన అభినయానికి, చలాకీ పాత్రలకు పెట్టింది పేరైన తాను గత రెండేళ్లుగా ప్రయోగాలతో సావాసం చేస్తున్నానని… అదే తనకు సత్ఫలితాలనిస్తోందని చెప్పింది. సమంత మాట్లాడుతూ ‘రెండేళ్లుగా రిస్క్లు చేస్తూ కెరీర్లో ముందుకుసాగుతున్నా. సవాళ్లతో కూడుకున్న పాత్రలే నాకు స్ఫూర్తినిస్తున్నాయి. హిందీలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నా. నాకు భాషపై పట్టుంది కానీ..ఉచ్చారణ విషయంలో దక్షిణాది ప్రభావం కనిపిస్తుంది. త్వరలో శిక్షకుణ్ని నియమించుకొని ఆ సమస్యను అధిగమిస్తా’ అని తెలిపింది. ‘ఫ్యామిలీమెన్-2’ సిరీస్లో నెగెటివ్ రోల్ చేయడం పట్ల ఓ ప్రాంత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది కదా అనే ప్రశ్నకు సమంత స్పందిస్తూ ‘నటిగా నచ్చిన పాత్రల్ని ఎంచుకునే స్వేచ్ఛ నాకు ఉంది. కథాపరంగా తప్పొప్పులు ఏమిటో నాకు తెలుసు. మంచి కంటెంట్తో ఉన్న సబ్జెక్ట్ గురించి మాత్రమే నేను ఆలోచిస్తా. సినిమా కథల్ని కేవలం సృజనాత్మక కోణంలో మాత్రమే ఆలోచించాలి’ అని వివరణ ఇచ్చింది.