‘ఈ సినిమా కాన్సెప్ట్తో పాటు టీజర్ నాకు బాగా నచ్చింది. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే కథ ఇది. ప్రపంచవ్యాప్తంగా మా ఎస్వీసి సంస్థ ద్వారా విడుదల చేయబోతున్నాం’ అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. తరుణ్భాస్కర్ హీరోగా నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. సోమవారం రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని దిల్రాజు థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్రాజు మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
రిలీజ్ డేట్ విషయంలో షరతులు వర్తిస్తాయని, ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా విడుదల ఉన్నందున ‘గాయపడ్డ సింహం’ రిలీజ్ డేట్ను మార్చుకునే వీలుందని, అవసరం అనుకుంటే ఓ వారం రోజులు వెనక్కి జరుపుకునే అవకాశం ఉందని దిల్ రాజు తెలిపారు. దిల్రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం తమకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని, ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లుంటాయని, వాటిని వరుసగా రివీల్ చేస్తామని చిత్ర సమర్పకుడు పవన్ సాదినేని అన్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్ అగస్తీ, నిర్మాతలు: కల్యాణ చక్రవర్తి, భానుకిరణ్ ప్రతాప, విజయ్కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్, రచన-దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్.