‘గోదావరి ప్రాంతం అనగానే అందమైన కొబ్బరి చెట్లు, ప్రకృతి దృశ్యాలను చూపిస్తూ అంతా ప్రశాంతంగా ఉందనే భావన కలిగిస్తారు. అయితే అక్కడ కూడా నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ కథ. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది గ్యాంగ్స్టర్ మూవీ కాదు’ అన్నారు కృష్ణచైతన్య. ఆయన దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం కృష్ణచైతన్య పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘త్రివిక్రమ్గారి సూచనతోనే విశ్వక్సేన్కు ఈ కథ చెప్పాను. మహాభారతంలో ‘నా అనేవాడే నీ మొదటి శత్రువు’ అనే మాట నాకు చాలా ఇష్టం. ఆ లైన్ ఆధారంగానే ఈ కథ నడుస్తుంది. ఓ ప్రాంతంలోని నాలుగు గ్యాంగుల మధ్య నడిచే పోరు, ఎత్తుకుపై ఎత్తులు ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్, ఎమోషన్స్తో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి. ఈ సినిమాకు యు.ఏ.సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ట్రైలర్లో సెన్సార్ అభ్యంతరాలు ఉండవు కాబట్టి కొన్ని మాటల్ని ఉంచాం. వాటిని సినిమాలో మ్యూట్ చేశాం. యువన్శంకర్రాజా సంగీతం ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. తనకు పవన్కల్యాణ్ అంటే ఎప్పటి ఎంతో అభిమానమని, ఆయనతో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నానని కృష్ణచైతన్య పేర్కొన్నారు.