అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘శివం భజే’ అనే టైటిల్ను ఖరారు చేశారు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్నది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కామెడీ, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఇప్పటికే 80శాతం పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం’ అన్నారు. కథకు సరిపోయే టైటిల్ దొరికిందని, కథలోని దైవిక కోణం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు పేర్కొన్నారు. హైపర్ ఆది, సాయిధీన, తులసి, దేవిప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: వికాస్ బడిస, ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్, దర్శకత్వం: అప్సర్.